శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

నిన్న మా సంస్థలో ఎయిడ్-ఇండియా అనే ఎన్.జి.ఓ. కి చెందిన డా. రవిశంకర్ అరుణాచలం మన దేశంలో సైన్సు చదువులకి సంబంధించిన కొన్ని మౌలిక సమస్యల గురించి మాట్లాడారు. ఆ ప్రసంగం లోని ముఖ్యాంశాల గురించి ఈ పోస్ట్.

ప్రసంగం గురించి చెప్పే ముందు వక్త గురించి నాలుగు ముక్కలు.

ఐ.ఐ.టి చెన్నై లో బీటెక్ పూర్తి చేసిన డా. రవిశంకర్ అమెరికాలో కార్నెగీ మెలాన్ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ లో పిహెచ్ డి పూర్తి చేసి, కొంత కాలం ఐబిఎమ్ లో పని చేసి 2003 లో ఇండియాకి తిరిగి వచ్చి తను చదువుకున్న ఐఐటి చెన్నైలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరారు. అమెరికాలో ఉన్నప్పటి నుంచి కూడా ఎయిడ్ – ఇండియాలో సభ్యుడిగా పని చేస్తూ, ఇండియా వచ్చాక కూడా ఆ పనులు ముమ్మరంగా కొనసాగిస్తూ వచ్చారు. కొన్నేళ్ల క్రితం ఐఐటి ఉద్యోగాన్ని వొదిలిపెట్టి పూర్తిగా ఎయిడ్-ఇండియాలోనే చేరిపోయారు. విద్యారంగంలో ముఖ్యంగా గ్రామీణ విద్యాలయాలలో సైన్సు చదువులని మెరుగుపరచడంలో మంచి కృషి చేస్తున్నారు.

ప్రసంగంలోముఖ్యాంశాలు:
మన విద్యావ్యవస్థలో ముఖ్య సమస్యలు ఏమిటి? అన్న ప్రశ్నతో ప్రసంగం మొదలయ్యింది. శ్రోతలు అంతా మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థులే కనుక ఉత్సాహంగా స్పందించి రకరకాల సమాధానాలు ఇచ్చారు – బట్టీ చదువు, టీచర్ల కొరత, పేదరికం, చదివిన చదువుకి ఉద్యోగాలు రాకపోవడం, చదివిన చదువుకు జీవితానికి సంబంధం లేకపోవడం ...మొదలైనవి.

దానికి స్పందనగా వక్త –
“ఈ కారణాలన్నీ సరైనవే. కాని విశేషం ఏంటంటే ఓ పదేళ్ల క్రితం ఈ ప్రశ్నకి సమాధానాలు వేరుగా ఉండేవి. పదేళ్ల క్రితం కూడా మేము, మా స్నేహితులు అమెరికాలో చదువుకుంటున్న రోజుల్లో ఇండియాలో విద్యావ్యవస్థ గురించి చర్చించుకునే వాళ్లం. ఆ రోజుల్లో ముఖ్యమైన సమస్య స్కూళ్ల కొరత. ఈ పది, పదిహేనేళ్లలో ఎంతో మారింది. ఇప్పుడు స్కూళ్ల కొరత అంతగా లేదు. కాని చదువులో నాణ్యత కొరవడుతోంది. ప్రస్తుతం అదీ సమస్య.”

“ఉన్న ప్రభుత్వ స్కూళ్లు అన్నీ భర్తీ కావడం లేదు. ఈ మధ్య చెన్నైలో ఉన్న 335 ప్రభుత్వ స్కూళ్లలో 30 పైగా ముసేశారు, తగినంత ఎన్రోల్మెంట్ లేదని. పెద్దగా ఆర్థిక స్తోమత లేని వారు కూడా, తమ శక్తికి మించి ఖర్చు పెట్టి, పిల్లలని ప్రైవేటు స్కూళ్లకి పంపిస్తున్నారు. (అలాగని ప్రైవేటు స్కూళ్లు అన్నిట్లో ప్రభుత్వ స్కూళ్లలో కన్నా చదువు మెరుగ్గా ఉంటుందని కూడా కాదు.) ప్రస్తుతం తమిళనాడులో ప్రాథమిక విద్యావ్యవస్థలో పిల్లల enrolment శాతం నమ్మలేనంత ఎక్కువ .... 98%. కాని హైస్కూల్ స్థాయికి వచ్చేసరికి ఆ శాతం సుమారు 60% కి పడిపోతుంది. అలా పడిపోవడానికి, తల్లిదండ్రులు తమ పిల్లలని బడి లోంచి బయటికి తీసేయడానికి ముఖ్య కారణం, పిల్లలకి బడులలో లభిస్తున్న చదువు మీద తల్లిదండ్రులకి నమ్మకం లేకపోవడమే. కనుక ప్రస్తుతం జరగాల్సినది స్కూళ్ల సంఖ్య పెంచడం, వసతులని పెంచడం మొ కాదు, చదువుని మరింత అర్థవంతంగా చెయ్యడం, పిల్లలకి మరింత అర్థమయ్యేలా చెయ్యడం!”

సైన్సు చదువులో సమస్యలు:

“సైన్సు చదువులో సైన్సు ప్రయోగాలు చాలా ముఖ్యం అని అందరికీ తెలిసిందే. కాని సైన్సు ప్రయోగాలు అనగానే పిల్లల్లకే కాక టీచర్లకి కూడా ప్రధానంగా ’వెర్నియర్ కాలిపర్స్’ లాంటి ప్రత్యేక వైజ్ఞానిక సామగ్రి గుర్తుకువస్తాయి. సరదాగా బుడగలతో, కాగితాలతో, సబ్బునీటితో, అద్దాలతో, అగ్గిపెట్టెలతో ఆడే ఆటలు సైన్సే కాదని వాళ్ల అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని తొలగించడానికి మేం చాలా శ్రమపడాల్సి వచ్చింది”
“సైన్సు చదువు విషయంలో మేం గమనించిన మొట్టమొదటి సమస్య ’బట్టీ పద్ధతి.’ పిల్లలు సైన్సు భావనలని అర్థం చేసుకోకుండా గుడ్డిగా వల్లవేస్తారు. ఉదాహరణకి హైస్కూలు పిల్లలు కూడా pressure (పీడనం) అన్న దానికి నిర్వచనం చక్కగా చెప్తారు గాని అదేంటో వివరించలేకపోతారు. ఈ సమస్యని గమనించి ప్రతీ అంశం మీద ఎన్నో చిన్న చిన్న ప్రయోగాలని రూపొందించి వాళ్లకి చూపించి, చేయించాం. అలా చేస్తుంటే ఒక సారి ఒక క్లాస్ లో ఒక తమాషా అనుభవం కలిగింది.”
“పీడనం ఎలా పనిచేస్తుందో ఒక చిన్న ప్రయోగం చేయిస్తున్నాం. ముందే కొంతవరకు ఊదబడ్డ ఒక గాలిబుడగ మరింత వ్యాకోచించేలా చెయ్యాలంటే, మామూలుగా దాని దారం విప్పి, మరి కొంచెం గాలి ఊదాలి. కాని అలా ఊదనక్కర్లేకుండా బుడగ సైజు ఎలా పెంచాలో తెలిపే ప్రయోగం ఇది. ఒక సిరింజిలో ఓ చిన్న, ముందే ఊదిన గాలిబుడగని ఉంచాం. ఇప్పుడు సిరింజి ’నోరు’ మూసి, పిస్టన్ ని వెనక్కి లాగితే లోపల అల్ప పీడనం ఏర్పడి, లోపల ఉన్న గాలిబుడగ మరింత వ్యాకోచిస్తుంది. ఇది చూసి పిల్లలు ఆశ్చర్యపోయారు.”
“ఊరికే చూస్తే సరిపోదు కనుక, వాళ్లే చేసి చూసుకుంటే బావుంటుందని ఆ సిరంజితో అందర్నీ ఆడుకోనిచ్చాం. అది ఆడపిల్లల క్లాసు. ఇద్దరు పిల్లలు దాంతో కుస్తీ పట్టడం మొదలెట్టారు. చివరికి ఒకమ్మాయి ప్రయోగం ఎలా చెయ్యాలో గ్రహించి, చేసి చూడగా లోపల ఉన్న బుడగ నిజంగానే వ్యాకోచించింది. అది చూసిన వెంటనే ఆ అమ్మాయి అన్న మటలు: “నిజమావె పెరుసావదు డీ! (నిజంగానే పెద్దదవుతోందే!)” విన్నాక నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను అంతకు కాసేపటి ముందే ఆ ప్రయోగాన్ని చేసి చూపించినా కలగని నమ్మకం, ఆ అమ్మాయిలు స్వయంగా తమ స్వహస్తాలతో ప్రయోగం చేసి చూసుకున్నాక కలిగిందన్నమాట. సైన్సు చదువులో స్వీయానుభవానికి అంత ప్రాధాన్యత ఉందని ఆ సందర్భంలో కళ్ళార చూశాను.”

(సశేషం...)

1 Responses to సైన్సు చదువులో స్వీయానుభవానికి అంత ప్రాధాన్యత ఉంది – డా. రవిశంకర్

  1. Anonymous Says:
  2. Absolutely

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts