శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

గ్రీకుల “మూల తత్వాలు”

Posted by V Srinivasa Chakravarthy Saturday, December 18, 2010

ప్రాచీన గ్రీస్ లో అయోనియా ప్రాంతానికి చెందిన మెలిటస్ నగరంలో ఉండేవాడు థేల్స్. ఈ అయోనియా పశ్చిమ ఏజియన్ సముద్ర తీరం మీద ఉండేది. ఇది ఆధునిక టర్కీ దేశంలోకి వస్తుంది. థేల్స్ చింతన ఈ ప్రశ్నతో మొదలై ఉండొచ్చు. ఒక పదార్థం మరో పదార్థంగా మారగలిగినప్పుడు, అసలు పదార్థం యొక్క లక్షణం ఎటువంటిది? ఉదాహరణకి కాల్చిన నీలి రంగు రాయి రాగిగా మారుతుందని మనకి తెలుసు. మరి రాయి దాని నిజస్వరూపమా, రాగి దాని నిజస్వరూపమా? లేక ఈ రెండూ కాని మరేదో తత్వమా? అలాగే ఒక పదార్థాన్ని మరే ఇతర పదార్థంగానైనా (ఏకబిగిన కాకపోయినా దశలవారీగా) మార్చగలమా? అదే నిజమైతే పదార్థాలన్నీ ఏదో మహత్తరమైన ఒకే మూలపదార్థం యొక్క విభిన్న రూపాలు అనుకోవచ్చా?

ఈ చివరి భావన నిజమని నమ్మాడు థేల్స్. పదార్థాలన్నీ ఒకే మూలపదార్థపు విభిన్న రూపాలనుకున్నాడు. ఆ భావనలో, విశ్వం పైన చూడడానికి సంక్లిష్టంగా కనిపించినా, దాని మూలంలో ఏకత్వం, సరళత్వం ఉన్నాయన్న నమ్మకం వ్యక్తం అవుతోంది. ఇంతకీ ఆ మూల పదార్థం ఏంటి? ఆ మూలతత్వం ఏమిటి?

ఆ తత్వం నీరు అని నమ్మాడు థేల్స్. ఎందుకంటే పదార్థాలు అన్నిట్లోకి నీరు అత్యంత సమృద్ధిగా ఉన్నట్టు కనిపిస్తుంది. నేలకి నలుదిశలా నీరు ఆవరించి ఉండడం కనిపిస్తుంది. వాతావరణంలోను నీరు తేమ రూపంలో వ్యాపించి ఉండడం కనిపిస్తుంది. నేలలోకి కూడా నీరు ఇంకి లోతుగా చొచ్చుకుపోతుంది. నీరు లేకపోతే జీవసృష్టి అసంభవం. కనుక భూమి ఓ చదునైన పళ్లెంలా ఉందని ఊహించుకున్నాడు థేల్స్. ఎల్లలులేని నీటి సముద్రం మీద ఆ పళ్లెం తేలుతున్నట్టు ఊహించుకున్నాడు.

పదార్థాలన్నీ ఒకే మూలపదార్థపు భిన్న రూపాలు అన్న థేల్స్ భావనకి త్వరలోనే ఎంతో ఆదరణ లభించింది. పండితులు దాన్ని సమ్మతించసాగారు. అయితే ఆ మూలతత్వం నీరు అన్న సూచన మీద మాత్రం కొంత వివాదం బయలుదేరింది.

థేల్స్ జీవించిన శతాబ్దానికి తదుపరి శతాబ్దానికల్లా ఖగోళశాస్త్ర రంగంలో చింతన బాగా మారింది. ఆకాశం గోళార్థం అని కాక పూర్ణగోళం అని ఇప్పుడు మనుషులు నమ్మసాగారు. అలాగే భూమి కూడా పూర్ణగోళం అని, ఖాళీ ఆకాశంలో ఆ గోళం ఒంటరిగా వేలాడుతోందని నమ్మసాగారు.

అయితే పూర్తిగా శూన్యమైన ప్రదేశం ఎక్కడా ఉండదని గ్రీకులు అనుకునేవారు. అందుకే భూమికి ఆకాశానికి మధ్య పూర్తి శూన్యం ఉండలేదని అనుకునేవారు. మనకి తెలిసినంత మేరకు, మనుషుల అనుభూతి విస్తరించినంత మేరకు, భూమికి ఆకాశానికి మధ్య వ్యాపించి ఉన్నది గాలే కనుక, ఆ గాలి అనంతంగా ఆకాశం అంచులవరకు వ్యాపించి ఉండేదని అనుకునేవారు.

ఇలాంటి తర్కాన్ని అనుసరించిన అనాక్సీమినీస్ అనే మరో గ్రీకు తాత్వికుడు ఆ ఏకైక మూలపదార్థం గాలి అని భావించాడు. క్రీ.పూ. 570 కి చెందిన ఈ అనాక్సీమినీస్ కూడా మిలెటస్ నగరానికి చెందినవాడే. భూమికి దూరంగా ఉన్నప్పుడు ఆ పదార్థం విరళంగా గాలిలా ఉన్నా, కేంద్రాన్ని సమీపిస్తున్న కొద్ది మరింత సాంద్రమై నీరు, నేల మొదలైన పదార్థాల ఏర్పాటుకు కారణం అవుతోంది అనుకున్నాడు.

ఇలా ఉండగా పొరుగూరు అయిన ఎఫెసస్ కి చెందిన హెరాక్లిటస్ (క్రీ.పూ. 540-475) మరో కోణం నుండి ఆలోచించసాగాడు. మర్పే విశ్వం యొక్క ముఖ్యలక్షణం అనుకుంటే అన్నిటికన్నా గొప్ప మారుదల గల పదార్థమే మూల పదార్థం అవుతుంది. అగ్నే ఆ పదార్థం అని భావించాడు హెరాక్లిటస్. అన్నిట్లోను అంతర్లీనంగా ఉండే అగ్నే నిరంతర మార్పుకి కారణం అవుతోంది.

(సశేషం...)

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts