శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.


http://www.andhrabhoomi.net/sisindri/lokam-chuttina-veerudu-905



అది 11, అక్టోబర్ 1492.

సాంటా మారియా ఓడలో ఓ ఎత్తయిన వేదిక మీద నించుని అడ్మిరల్ కొలంబస్ చుట్టూ కలయజూస్తున్నాడు. బయటికి నిబ్బరంగానే ఉన్నా లోలోపల చాలా ఆందోళన పడుతున్నాడు. ఏ క్షణాన అయినా నేల కనిపించాలి. అలా ఆత్రంగా చుట్టూసముద్రాన్ని పరిశీలిస్తుండగా దూరంగా ఏదో చిన్న కాంతి లాంటిది కనిపించింది. ఎవరో ఓ దివిటీ పట్టుకుని ఏదో తీరం మీద పరుగెత్తుతున్నట్టుగా ఉందా దృశ్యం. అదేంటో కాస్త శ్రద్ధగా పరిశీలిద్దాం అనుకునే లోపల ఆ దృశ్యం మాయమయ్యింది.


మళ్లీ ఆ దృశ్యం కనిపిస్తుందేమో నని రాత్రంతా అలాగే ఆ వేదిక మీద జాగారం చేశాడు. తనలాగే ఓడల మీద కొందరు నావికులు కూడా అలాగే పహరా కాస్తున్నారు. అలా అంతమంది వేయి కళ్లతో కనిపెట్టుకుని ఉన్న పరిస్థితిలో, అర్థ రాత్రి రెండు గంటలకి ఒక నావికుడికి అల్లంత దూరంలో తీరం లాంటిది కనిపించింది. అంతకు ముందే పొగమంచుని చూసి తీరం అనుకుని పొరబడ్డ కారణంగా వెంటనే అతడు అందరినీ అప్రమత్తం చెయ్యలేదు. కళ్లు నులుముకుని జాగ్రత్తగా చూశాడు. నిజంగా తీరమే. తారాకాంతిలో దాని రూపురేఖలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. “నేల కనిపించింది! నేల కనిపించింది!” అంటూ ఒక్క సారిగా కేకలు అందుకున్నాడు. ఆ నావికుడి పేరు రాడ్రిగో.

రాడ్రిగో సూచించిన దిశలో కొలంబస్ కూడా చూశాడు. నిజమే, అది తీరమే. చీకట్లో ఎక్కువ వివరాలు తెలియడం లేదు. కనుక తీరాన్ని సమీపించడం ఆ సమయంలో శ్రేయస్కరం కాదు. దూరానే లంగరు వేసి అక్టోబర్ పన్నెండు నాటి పొద్దు వెలుగు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. కొలంబస్ మనసులో తీరం కనిపించిందన్న సంతోషం త్వరలోనే ఎగిరిపోయింది. దాని స్థానంలో ఓ సందేహం మనసులో దొలిచేస్తోంది.

తాము చేరుకున్నది ఇంతకీ ఏ దేశం? ఇది ఇండియా, కాథే ప్రాంతాలకి చెందిన తీరం అయితే అల్లంత దూరంలో శతకోటి దీపాలతో వెలిగే ఎత్తయిన భవనాలు కనిపించాలి. గొప్ప నాగరిక ప్రాంతాలకి ఉండే లక్షణాలు నిండుగా ఉండాలి. కాని ఈ తీరం అంతా నిర్మానుష్యంగా ఉంది. ఎక్కడా ఓ చిన్న విస్ఫులింగం అయినా లేదు. తీరం వెనుక నేపథ్యంలో నల్లని, మూగ చెట్లు తప్ప మరేమీ కనిపించడం లేదు. ఈ చిక్కు ముడి విడిపోవాలంటే తెల్లవారిన దాకా ఎదురుచూడాల్సిందే. ఆ రాత్రి కొలంబస్ కి నిద్ర పట్టలేదు.

మర్నాడు శుక్రవారం. నెమ్మదిగా తెల్లవార సాగింది. వికసిస్తున్న అరవిందంలా పలచని సూర్య కాంతిలో తీరం మీద విశేషాలన్నీ కళ్ళ ముందు నెమ్మదిగా విచ్చుకుంటున్నాయి. తమ కళ్ల ఎదుట కనిపిస్తున్న ఈ కొత్త భూమి అంతా పచ్చగా కళకళలాడుతోంది. అయితే నాగరిక చిహ్నాలే కనిపించడంలేదు. కొలంబస్ ఒక నిర్ణయానికి వచ్చాడు. అది జపాన్ పొలిమేరల్లో ఉండే దీవి కావచ్చని అనుకున్నాడు.
తీరానికి తగినంత దగ్గరగా వచ్చి, లంగరు వేసి, మూడు చిన్న పడవల్లో పాటు కొలంబస్ బృందం తీరం చేరుకుంది.

అంతవరకు ఓ కొత్త భూమిని కనుక్కోవడం మీదే తన ధ్యాసంతా ఉండేది. కాని ఇప్పుడు తన అసలు కర్తవ్యం గుర్తొచ్చింది. తను వచ్చింది ఈ కొత్త భూములని సరదాగా చూసిపోవడానికి కాదు. తను చేస్తున్నది విహార యాత్ర కాదు. ఇదో జైత్ర యాత్ర. తను కనుక్కున్న భూమలని జయించి స్పెయిన్ రాజు, రాణులకి బహుమతిగా సమర్పించుకోవాలి. ఇప్పుడు తను కేవలం ఒక పర్యాటకుడో, నావికుడో కాడు. ఇప్పుడు తనొక యోధుడు. శత్రువుని జయించి తన రాజ్యానికి విజయాన్ని సాధించడమే జీవన లక్ష్యంగా గల సేనాపతి.

కొలంబస్ చేతిలో స్పెయిన్ రాజ్యపు విజయ పతాక ఉంది. కవచం, శిరస్త్రాణం మొదలైన హంగులన్నీ తగిలించుకున్నాడు. వీపుకి కట్టుకున్న ఎర్రని క్లోక్ చల్లని సముద్రపు గాలికి రెపరెపలాడుతోంది.

అంతలో తీరం మీద చెట్ల మాటు నుండి కొంతమంది జనం బయటికి రావడం కనిపించింది. యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు కొలంబస్.
తీరం మీద కాలు మోపిన వెంటనే మట్టిలో స్పెయిన్ జెండా పాతి “నా స్వామి మహారాజు ఫెర్డినాండ్ కోసం, స్వామిని మహారాణి ఇసబెల్లా కోసం ఈ భూమిని ఆక్రమిస్తున్నాను,” అని గంభీరంగా ప్రకటించాలనుకున్నాడు.



కాని ఎదురుగా కనిపించిన వ్యక్తుల వాలకం చూసి నోరు వెళ్లబెట్టాడు.

(ఇంకా వుంది)



http://www.andhrabhoomi.net/sisindri/lokam-chuttina-veerudu-516



స్థానికులని బలవంతంగా ఓడల లోకి ఎక్కించుకుని దరిదాపుల్లో ఉన్న దీవులన్నీ పర్యటించడం మొదలెట్టాడు కొలంబస్. ఆ పర్యటనలలో ఓ విశాలమైన ప్రాంతం కనిపించింది. (అది నిజానికి ప్రస్తుతానికి మనం క్యూబా అని పిలిచే పెద్ద దీవి. కాని కొలంబస్ అదే ఆసియా ఖండం అనుకున్నాడు.) ఇలా ఉండగా పింటా ఓడకి కెప్టెన్ అయిన ఆలోన్సో పింజాన్ కి ఈ వ్యవహారంతో విసుగు పుట్టి తను వేరేగా మిగతా రెండు ఓడలని విడిచి పెట్టి మరో దిశలో ప్రయాణిస్తూ ముందుకు సాగిపోయాడు. ఈ పరిణామం కొలంబస్ కి ససేమిరా నచ్చలేదు కాని అలోన్సీని అతడు నివారించలేకపోయాడు. ఇక విసుగు పుట్టి క్రిస్మస్ సందర్భంలో ప్రయాణం నిలుపు చేసి ఏదో ఒక రేవులో విశ్రాంతి తీసుకోవాలని నిశ్చయించాడు. అయితే వారి దురదృష్టం వల్ల సరిగ్గా క్రిస్మస్ ముందు రోజు ఓ దుర్ఘటన జరిగింది.


కొలంబస్ ఉన్న సాంటా మారియా అనే ఓడని నడుపుతున్న ఓ కుర్రవాడు అనుభవం లేకపోవడం వల్ల ఓడని ఓ పెద్ద బండకి ఢీ కొట్టించాడు. ఓడకి పెద్ద చిల్లు పడి నీట మునగడం ఆరంభించింది. ఈ పరిణామంతో కొలంబస్ బాగా కదిలిపోయాడు. చేతిలో ఉన్న రెండు ఓడల్లో పెద్దదైన సాంటా మారియా నాశనమై పోయింది. ఇక మిగిలిన ‘నీనా’ కాస్త చిన్నది. ఉన్న నావికులంతా ఆ ఓడలో సరిగ్గా పట్టరు. పట్టినా అందులో చిన్న చిన్న ప్రయాణాలు వీలవుతాయేమో గాని అందరూ తిరిగి స్పెయిన్ కి వెళ్లడం అసంభవం. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు కొలంబస్.


ముంపునకు గురైన ఓడని పూర్తిగా విరిచేసి అలా వచ్చిన చెక్క ముక్కలతో తీరం మీద ఓ శిబిరాన్ని నిర్మించాలని నావికులకి ఆదేశించాడు. నావికులు పన్లోకి దిగారు. వారి శ్రమ ఫలితంగా ఓ చిన్న కోట లాంటిది తయారయ్యింది. ఆ కోటకి ‘ల నావిడాడ్’ అని పేరు పెట్టారు.
కోట నిర్మాణం ముగిశాక తన నావికులలో నలభై మందిని ఎంచుకుని ఆ కోటలో తను వచ్చే వరకు ఉండమని ఆదేశించాడు. మిగితా సిబ్బందితో తను స్పెయిన్ కి తిరిగి వెళ్లి వస్తానని, తను వచ్చేవరకు ఆ కోటని కనిపెట్టుకుని ఉండమని చెప్పాడు. స్థానిక “ఇండియన్ల”తో సత్సంబంధాలు పెంచుకొమ్మని, స్పెయిన్ రాజు, రాణుల మర్యాద నిలిచేలా మసలుకొమ్మని ఆదేశించాడు. కొలంబస్ తో తిరిగి ఆ దారుణ యాత్రలో పాల్గొనే కన్నా ఇక్కడే ఉండడం మేలని తలచారు ఆ నావికులు. పైగా కొలంబస్ వచ్చేలోగా ఆ ప్రాంతం అంతా గాలించి టన్నులు కొద్దీ బంగారాన్ని తెచ్చి ఆ కోటని నింపొచ్చని వారి ఆలోచన, ఆశ.


కొలంబస్ ‘నీనా’ ఓడలో తిరిగి స్పెయిన్ కి బయలుదేరాడు. కొంత దూరం పోయాక అంతకు ముందు తమని విడిచి వెళ్లిన ‘పింటా’ ఓడ కనిపించింది. ‘పింటా’ కెప్టెన్ అలోన్సో తను చెసిన పొరబాటుకి క్షమించమని కొలంబస్ ని అర్థించాడు. అతడు బంగారం మీద దురాశతో తమని విడిచి వెళ్లాడని, బంగారం దొరక్క తిరిగి వస్తున్నాడని కొలంబస్ కి బాగా తెలుసు. కాని బయటికి అలోన్సోని ఏమీ అనకుండా ఊరుకున్నాడు. రెండు ఓడలు స్పెయిన్ దిశగా సాగిపోయాయి.

స్పెయిన్ నుండి వచ్చినప్పటి కన్నా తిరుగు ప్రయాణం మరింత భయంకరంగా దాపురించింది. భీకర తుఫానులతో సముద్రం అతలాకుతలంగా ఉంది. ఒక దశలో నీనా ఓడ నాశనం అవుతుందనే అనుకున్నాడు కొలంబస్. కాని అదృష్టవశాత్తు సురక్షితంగా తుఫానులోంచి బయట పడ్డారు.


అయితే మార్గమధ్యంలో అలోన్సా పింజాన్ మళ్లీ తన బుద్ధి చూపించుకుని కొలంబస్ ని వదిలి పింటా ఓడలో వెళ్లిపోయాడు. తనే ముందు స్పెయిన్ చేరుకుని, ఘనత అంతా దక్కించుకోవాలని అతడి దురాశ.

15 మార్చి, 1493, నాడు నీనా ఓడ (పింటా కంటే ముందు) స్పెయిన్ లోని పాలోస్ రేవుని చేరుకుంది. కొలంబస్ కి తన బృందానికి పాలోస్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. కొలంబస్ గౌరవార్థం పాలోస్ లో శతఘ్నులు పేలాయి. కొలంబస్ సాహసాలు ఊరంతా పొక్కాయి. తదనంతరం కొలంబస్ బార్సెలోనా కి వెళ్లి అక్కడ మహారాజు ఫెర్డినాండ్ ని, రాణి ఇసబెల్లాని సందర్శించాడు. రాజు, రాణులు ఇద్దరూ కొలంబస్ ని సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. కొలంబస్ తనతో పాటు తెచ్చుకున్న కాసిన్ని మణి మాణిక్యాలని, రంగురంగుల పక్షులని, బంధించి తెచ్చిన దాస దాసీ జనాన్ని వారికి సమర్పించుకున్నారు. గతంలో మార్కో పోలో వర్ణించిన ఇండియా, చైనా ల నుండి వచ్చినవే ఈ బహుమతులని రాజు, రాణులు ఎట్టకేలకి నమ్మారు. కొలంబస్ తను కొత్తగా కనుక్కున్న భూములకి మరొక్కసారి ప్రయాణించడానికి వాళ్లు ఆనతి ఇచ్చారు.

25 సెప్టెంబర్ 1493, నాడు కొలంబస్ పదిహేడు నౌకలు గల నౌకా దళంతో, పదిహేను వందల మంది సిబ్బందితో మరొక్కసారి అట్లాంటిక్ సముద్రం మీద “కొత్త లోకం” దిశగా బయల్దేరాడు.

(ఇంకా వుంది)


http://www.andhrabhoomi.net/intelligent/nidraa-lokam-735

నిద్రాలోకంలో కొన్ని సాహసోపేత ప్రయోగాలు



“అసలు మనిషన్నవాడు రోజుకి మూడు సార్లు పడుకోవాలోయ్!” ఆఫీస్ లో కునుకు తీస్తున్న సుబ్బారావు తటాలున లేచి ఎదురుగా అప్పారావు కనిపించగానే లెక్చర్ అందుకున్నాడు. “పొద్దున్న టిఫిన్ తరువాత గంట, మధ్యాహ్నం భోజనం తర్వాత రెండు గంటలు, రాత్రి ప్రశాంతంగా పది గంటలు.” సుబ్బారావు లా విచ్చలవిడిగా నిద్రపోయేవాళ్లు లేకపోలేదు. అలాగే సహజంగా అతితక్కువగా నిద్రపోయేవాళ్ళూ ఉన్నారు. ముఖ్యంగా బాగా వయసు పై బడ్డ వాళ్లలో ఎంతో మందికి రోజుకి ఐదు గంటలు పడుకోవడమే కష్టంగా ఉంటుంది. ఈ రోజుల్లో టీనేజి పిల్లల్లో ఆలస్యంగా పడుకుని పొద్దున్నే లేచి బడికి వెళ్ళడానికి ఇబ్బంది పడే వాళ్లు ఎందరో. ఇక “షిఫ్ట్ డ్యూటీ” చేసే ఉద్యోగస్థుల విషయంలో నిద్రా సమయాలు చిందరవందరగా ఉంటాయి. ఆ విధంగా నిద్రపోయే అలవాట్లలో మనుషులలో ఎంతో వైవిధ్యం కనిపిస్తున్నా ఆ వైవిధ్యంలో ఒక సామాన్య లక్షణం కనిపిస్తుంది. నిద్ర అనేది ఒక దైనిక లయ. సామాన్యంగా పగలు, రాత్రి అనే లయని అనుసరిస్తూ సాగుతుంది నిద్ర లయ. సమాజం నడవాలంటే మనుషులు పని చెయ్యాలి కనుక, పనులలో మనుషులు ఒకరి మీద ఒకరు ఆధారపడతారు కనుక, అందరూ ఒకే సారి నిద్రించి, ఒకే సారి మెలకువగా ఉంటే సౌకర్యంగా ఉంటుంది. కాని ఇలాంటి సామాజిక, భౌతిక కట్టుబాటు లేకుండా సహజంగా సాగనిస్తే నిద్ర లయ ఎలా ఉంటుంది?


నిద్ర లయ అనేది బాహ్య పరిస్థితుల మీద ఆధారపడుతుందా, లేక ఓ స్వతస్సిద్ధమైన శరీర ధర్మం మీద ఆధారపడుతుందా అన్న విషయాన్ని తెలుసుకోడానికి ఫ్రాన్స్ లో 1972 లో మిచెల్ సిఫ్ర్ అనే ఓ వ్యక్తి ఓ విచిత్రమైన, సాహసోపేతమైన, (కొంచెం ప్రమాదకరమైన) ప్రయోగం చేశాడు. అయితే ప్రత్యేకించి ప్రయోగం చెయ్యాలని ఈ ప్రయోగం చెయ్యలేదు. అది అనుకోకుండా జరిగింది.
వృత్తి రీత్యా మిచెల్ ఓ భౌగోళిక శాస్త్రవేత్త. ప్రత్యేకించి భూగర్భంలోని గుహలని పర్యటించి, అధ్యయనం చెయ్యడం మెచెల్ కి ఓ హాబీ. హాబీలా మొదలైనా అదే తన జీవనవృత్తిగా పరిణమించింది. 1961 లో మిచెల్ కొందరు మిత్రులతో పాటు ఆల్ప్స్ పర్వతాల అడుగున, భూగర్భంలో ఓ హిమానీనదం (glacier) ప్రవహిస్తోందని తెలుసుకుని, దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యాలని బయలుదేరాడు. ఆ బృందం భూగర్భ గుహలలో పదిహేను రోజులు గడిపి ఎన్నో అధ్యయనాలు చేశారు. కాని అధ్యయనం పూర్తిచెయ్యడానికి పదిహేను రోజులు చాలా తక్కువ సమయం అనిపించింది. కనుక మరో సారి ప్రయత్నించి రెండు నెలలు గడిపారు. ఈ సారి గుహల కన్నా అలాంటి దారుణ, ఏకాంత పరిస్థితుల్లో మనిషి ఎలా మనగలుగుతాడు అన్న విషయం గురించి ఎన్నో విషయాలు తెలిశాయి. అది చూసిన మిచెల్ కి ఓ గొప్ప ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన తన జీవితాన్ని మార్చేసింది. ఆ ఆలోచనే ఓ వైజ్ఞానిక శాఖకి పునాది అయ్యింది.


సాధారణ బాహ్య పరిసరాలకి దూరంగా, కఠోరమైన ఏకాంతంలో మనిషిని ఉంచితే ఎలా స్పందిస్తాడు? అతడిలో ఎలాంటి మానసిక మార్పులు వస్తాయి? అతడి నిద్ర లయ ఎలా మారుతుంది? అతడిలో కాలాన్ని గురించిన అనుభూతి ఎలా మారుతుంది? మొదలైన ప్రశ్నల సమాధానాల కోసం గాలిస్తూ మిచెల్ ఓ సాహసోపేతమైన ప్రయోగానికి పూనుకున్నాడు. 1972 లో జరిగిన ఈ ప్రయోగంలో మానవ ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేకుండా భూగర్భ గుహలో ఒక్కడే జీవిస్తూ అలాంటి పరిస్థితుల్లో తనలోని మార్పులని పరిశోధిస్తూ పోయాడు. గుహకి ముఖద్వారం వద్ద ఒక బృందం వేచి వుంటుంది. మూడు సందర్భాల్లో మాత్రమే మిచెల్ వైర్లెస్ ద్వారా వాళ్లకి కబురు పెడతాడు - నిద్ర నుండి మేలుకున్న వెంటనే, భోజనం చేసిన తరువాత, నిద్రపోయే ముందు. అతడు పిలవకుండా ఎవరూ గుహలోకి రాకూడదు. బి.పి, ఉష్ణోగ్రత మొదలైన శరీర లక్షణాలని ఎప్పటికప్పుడు చేరవేసేందుకు గాను తన ఒంటి నిండా వైర్లు అమర్చబడి ఉంటాయి. చదువుకుంటూ, రాసుకుంటూ, తన మీద తను పరిశోధనలు చేసుకుంటే కాలక్షేపం చేసేవాడు. అలా జీవిస్తున్న పరిస్థితుల్లో కాలం గురించి తన అనుభూతిలో సమూలమైన మార్పులు రావడం గమనించాడు.


ఉదాహరణకి తనని కలుసుకోడానికి పై నుండి ఎవరైనా వచ్చినప్పుడు తనకి తను రెండు చిన్న పరీక్షలు పెట్టుకునేవాడు. మొదటిది, తన నాడి చూసుకుని నాడి వేగం కొలవడం. రెండవది, సెకనుకి ఒక అంకె చొప్పున 1 నుండి 120 వరకు లెక్కపెట్టడం. అంటే మామూలుగా రెండు నిముషాలు పడుతుంది. కాని మిచెల్ కి 5 నిముషాలు పట్టింది. అది నీరసం వల్లనో, చిత్త చాంచల్యం వల్లనో జరిగిన మార్పు కాదు. తను ఆరోగ్యవంతంగానే ఉన్నాడన్న విషయం తన చుట్టూ ఉన్న పరికరాలు చెప్తున్నాయి. నాడి వేగంలో పెద్ద మార్పు లేదు. కాని కాలం యొక్క తన అనుభూతిలో మార్పు వచ్చింది.


ఆ మార్పు మరింత సంచలనాత్మకంగా కూడా వ్యక్తం అయ్యింది. ఉదాహరణకి అతడు జూలై 16 నాడు గుహలోకి ప్రవేశించాడు. సెప్టంబర్ 14 కల్లా ప్రయోగం పూర్తి చేసుకుని బయటికి రావాలని ఉద్దేశం. కాని “అనుకున్న దాని కన్నా ముందుగానే” అతడి బృందం ప్రయోగం అయిపోయిందని కబురు పెట్టింది. తన ప్రకారం అది ఆగస్టు 20. ఆంటే వాస్తవ కాలగతి కన్నా తన మానసిక కాలగతి నెమ్మదించింది అన్నమాట.

కాలానుభూతిలో ఈ మార్పులు నిద్ర లయలో కూడా కనిపించాయి. రేయింబవళ్లతో సంబంధం లేకుండా జీవించడం వల్ల, నిద్ర లయ మారిపోయింది. 24 గంటల ఆవృత్తికి బదులు మొదట్లో 24 గంటల, 30 నిముషాల ఆవృత్తి కనిపించింది. అది పెరిగి పెరిగి కొంత మంది విషయంలో 48 గంటల ఆవృత్తి వరకు కూడా వెళ్లింది.

ఇలాంటి ప్రయోగాల వల్ల సహజ నిద్ర లయల గురించి ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాడు మిచెల్. ఈ ప్రయోగాలు ‘జీవకాలమాన శాస్త్రం’ (chronobiology) అనే కొత్త వైజ్ఞానిక శాఖకి జీవం పోశాయి. ఫ్రాన్స్ లోనే కాక తదనంతరం అమెరికాలో కూడా గుహలలో అలాంటి ప్రయోగాలు చేశాడు. ఇటీవలి కాలంలో కూడా మరెందరో అలాంటి ప్రయోగాలు చేశారు. మన దేశంలో తమిళనాడు లోని మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో ఇలాంటి ప్రయోగాలు జరిగాయి. అయితే గుహలలోనో, గనులలోనో కాకుండా మరింత సౌకర్యమైన పరిస్థితుల్లో, రేబవళ్లు తెలీకుండా జాగ్రత్తపడుతూ, ప్రయోగాలు చేశారు. మిచెల్ చేసిన ప్రమాదకరమైన ప్రయోగాలు చెయ్యడానికి ఆధునిక వైజ్ఞానిక నైతికతా సదస్సులు ఒప్పుకోవు. అయితే ఏ రంగంలోనైనా పురోగాముల విషయంలో అలా సాహసం చెయ్యక తప్పదేమో. ఓ వైజ్ఞానిక సత్యాన్ని తెలుసుకోవడం కోసం ప్రాణాలకి తెగించి సాహసించిన వైజ్ఞానిక వీరుల జాబితాలోకి చేరిపోయాడు మిచెల్ సిఫ్ర్.


http://www.andhrabhoomi.net/sisindri/sisi-369


తీరం మీద పాదం మోపగానే ఆ భూమిని స్పెయిన్ రాజ ప్రతినిధిగా తన రాజు కోసం, రాణి కోసం ఆక్రమిస్తున్నట్టుగా ప్రకటించాడు. ఆ భూమికి సాన్ సాల్వడార్ అని పేరుపెట్టాడు. (సాన్ సాల్వడార్ అంటే ‘ముక్తి ప్రదాత’ అని అర్థం. కొలంబస్ బృందం తాము సందర్శించిన ప్రాంతాలకి ఎక్కువగా క్రైస్తవ సాంప్రదాయానికి చెందిన పేర్లు పెడుతూ వచ్చారు.) అంతవరకు కొలంబస్ ని నానా రకాలుగా ఆడిపోసుకున్న ఇతర ఓడల కెప్టెన్లు కూడా ఇప్పుడు ఈ అనుకోని విజయానికి మురిసిపోయి దాసోహం అన్నారు. పడవ దిగిన కొలంబస్ చుట్టూ తనతో పాటు తీరం మీదకి వచ్చిన కెప్టెన్లు, కొద్దిమంది నావికులు అతడి ఎదుట వినమ్రంగా మోకరిల్లారు.


కాని అల్లంత దూరంలో చెట్ల మాటు నుండి బయటికి వస్తున్న స్థానికులని చూసి కొలంబస్ ముందు అవాక్కయ్యాడు. ఇండియా, కాథే లాంటి సంపన్న ప్రాంతాలకి చెందిన జనం ఖరీదైన వస్త్రాలంకరణతో హుందాగా ఉంటారని ఆశించాడు. కాని ఈ మనుషులకి ఒంటి మీద పెద్దగా బట్ట ఉన్నట్టు లేదు. ముఖం మీద, ఒంటి మీద వింతగా రంగులు పులుముకున్నారు. చెవులకి మాత్రం చెవిపోగులు వేలాడుతున్నాయి. చూడబోతే అవి బంగారపు పోగుల లాగానే ఉన్నాయి. నేపథ్యంలో ఎక్కడా పెద్ద పెద్ద భవనాలు, గోపురాలు కనిపించలేదు. అదో విశాలమైన, పచ్చని దీవి. మధ్యలో ఓ పెద్ద సరస్సు కనిపిస్తోంది.


ఆ వచ్చిన స్థానికులు కొలంబస్ బృందాన్ని చూసి అబ్బురపడ్డారు. ధగధగలాడే వస్త్రాలతో రాజసంగా నిలుచున్న కొలంబస్ ని చూసి ఎవరో మహానుబావుడు అనుకున్నారు. అతడి చుట్టూ మోకరిల్లి భక్తిగా కొలుస్తున్న తన పరివారాన్ని చూస్తే వారి నమ్మకం ఇంకా బలపడింది. తమ లాగా కాక తెల్లని మైఛాయతో వెలిగిపోతున్న ఈ పరదేశీలని చూసి వీళ్లెవరో దేవతలు అనుకున్నారు. “రెక్కల పడవలలో” (తెరచాపలు గల ఓడలు) దివి నుండి దిగి వచ్చిన వేలుపులు అనుకున్నారు. కొలంబస్ బృందం తమతో తెచ్చిన రంగురంగుల బట్టలు, రకరకాల పూసలు, మొదలుకొని తాము ఎన్నడూ చూడని ఎన్నో సుందరమైన వస్తువులు కానుకలుగా సమర్పించారు. ఆ విధంగా తమ మీద అడగకనే వరాలు గుమ్మరిస్తున్న దేవతలు అంటే వారికి చెప్పలేనంత గౌరవం కలిగింది. వారిని ఆదరంగా తమ దీవిలోకి ఆహ్వానించారు. నానా రకాల పళ్లు, పుష్పాలు, పలురంగుల పక్షులు సమర్పించుకుని తగిన విధంగా ఆతిథ్యం చూపించారు. ఆ విధంగా ఆ “దేవతలు”, ఈ “మానవులు” సామరస్యంగా కలిసిపోయారు.


కొలంబస్ కి మొదట్లో తాము వచ్చిన ప్రాంతం ఇంతకీ ఏంటి అన్న విషయం మీద కొంత సందేహం కలగకపోలేదు. కాని స్థానికుల బంగారపు చెవిపోగులు చూసి వీళ్లు “ఇండియన్లు” అనే అనుకున్నాడు. తాము పాదం మోపిన దీవి ఇండియా, కాథేలు కాకపోయినా ఆయా ప్రాంతాల తీరాలకి బాగా సమీపంలో ఉన్న ఏదో దీవి అయ్యుండొచ్చు అనుకున్నాడు. అక్కణ్ణుంచి మరి కాస్త దక్షిణ-పశ్చిమ దిశగా ప్రయాణిస్తే తప్పకుండా ఇండియా తీరం వస్తుందని అనుకున్నాడు.

కొలంబస్ తను చూసిన ఈ కొత్త భూమి గురించి, స్థానికుల గురించి ఈ విధంగా రాసుకున్నాడు – “పగటి ముందు రాత్రి ఎలా వెలవెలబోతుందో, ఈ నవ్య భూమి యొక్క వైభవం ముందు తక్కిన భూములన్నీ అలా వెలవెలబోతాయి. ఇక్కడి జనం కూడా పరాయి వారిని తమ వారిగా తలచి ఆదరించే ఉదారస్వభావులు. వారి భాష తీయగా, మృదువుగా ఉంటుంది. వారి ముఖాన ఎప్పుడూ చిరునవ్వులు తాండవిస్తుంటాయి. ఇక అతిథి సత్కారాల విషయంలో వారిని మించిన వారు ఉండరు. అసలు ఈ మొత్తం ప్రపంచంలో వీళ్ల కన్నా ఉత్తములు ఉండరు.”

అలా స్థానికులని అంతగా పొగిడిన కొలంబస్ త్వరలోనే కొంతమంది స్థానికులని బలవంతంగా తమ ఓడలకి ఎక్కించుకుని వారి సహాయంతో ఆ చుట్టుపక్కల ఉన్న దీవులన్నిటినీ అన్వేషించడం మొదలెట్టాడు. తనని అంతగా ఆదరించిన వారి పట్ల అతి కిరాతకంగా ప్రవర్తించి తనలోని దుష్టత్వాన్ని బయటపెట్టాడు.

అలా స్థానికుల మార్గదర్శకత్వంలో ఒక్కొక్క దీవినీ సందర్శిస్తూ పోయాడు. కాని ఎక్కడా తను ఊహించిన పాలరాతి మేడలు, బంగారు బురుజులు కనిపించలేదు.

అలా ప్రయాణిస్తుండగా మనం ప్రస్తుతం “వెస్ట్ ఇండీస్” అని చెప్పుకునే ద్వీపకల్పంలో ఓ పెద్ద ద్వీపం అయిన క్యూబాని చేరుకున్నాడు. ఇక్కడ కూడా తను ఎదురుచూసిన గొప్ప నాకరిక లక్షణాలు కనిపించలేదు. వెదురు పాకలు, జొన్న చేలు తప్ప.

ఈ వ్యవహారం ఎటూ సాగడం లేదని గమనించాడు, ‘పింటా’ ఓడకి కెప్టెన్ అయిన అలోన్సో పింజాన్. అతడి మనసులో ఓ ఆలోచన మెదిలింది.

(ఇంకా వుంది)


ప్రయాణించే సేల్స్‌మాన్ సమస్య

Posted by V Srinivasa Chakravarthy Wednesday, August 17, 2011 1 comments


ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురించబడిన వ్యాసం http://www.andhrabhoomi.net/intelligent/prayaniche-296


పార్వతమ్మగారి అమ్మాయి పెళ్లి పిలుపుల సమస్య

పార్వతమ్మకి ఓ పెద్ద ఇక్కట్టు నెత్తిన పడింది. టీ.సీ.యస్. లో పని చేస్తున్న వాళ్ళ అమ్మాయి రేఖకి పెళ్లి కుదిరింది. రెండు రోజుల్లో పెళ్ళి, మూడో రోజు రిసెప్షన్. కనుక ఈ రోజు పెళ్లి పిలుపులు, రేపు షాపింగ్! భర్త పరంధామయ్య యూనివర్సిటీలో ఫిలాసఫీ  ప్రొఫెసరు. ఇంట్లో ఏం జరుగుతోందో ఏమీ పట్టించుకోడు. అన్నీ ఈవిడే నెత్తిన వేసుకుని చెయ్యాలి. ఒక్క రోజులో ఇంచుమించు యాభై మంది ఇళ్ళకి వెళ్లి శుభలేఖలు పంచాలి. అంతా ఒక్క చోట ఉంటే బావుణ్ణు.  షంసా బాద్ నుండి  ఆల్వాల్ దాకా,  కుక్కట్ పల్లి నుండి  ఉప్పల్ దాకా కుప్పలుతెప్పలుగా ఉన్నారు బంధువులు. ముందు మెహదీపట్నం తో మొదలు పెట్టి, జూబిలీ హిల్స్  మీదుగా సనత్ నగర్ కి వెళ్లి, అక్కణ్ణుంచి  బాలానగర్ కి వెళ్లడమా? లేక ముందు బహదూర్ గుడా కి వెళ్లి, దార్లో లక్ష్మీ గూడాకి కూడా  వెళ్లి, షంసాబాద్ కి వెళ్లడమా? ఏది మేలైన పద్ధతి? ఈ ఇళ్ళన్నీ చుట్టి సాయంకాలానికి ఇంటికి చేరాలంటే అతి దగ్గరి దారి ఏంటి? ఆలోచిస్తుంటే తల వేడెక్కిపోతోంది. “నా వల్ల కాదు రేఖా! మీ నాన్నగారేమో ఏవీ పట్టించుకోరు. నీ పెళ్లిపిలుపులేవో నువ్వే చూసుకో” అంటూ కూతురికి ఫోన్ చేసి చెప్పేసింది. కాని రేఖకి ఆ రోజు లీవ్ దొరకలేదు. ఎలాగోలా ఓపిక చేసుకుని ఆ పని అమ్మే చెయ్యాలి. తల్లితో ప్రాధేయపడుతున్నట్టుగా అంది. “అయ్యో అమ్మా! ఈ సమస్య నాకు వదిలేయ్. నువ్వు చెప్తున్నది సామాన్యమైన సమస్య కాదు. అదో ముఖ్యమైన గణిత సమస్య. కంప్యూటర్ సైన్స్ సమస్య. ఒక్క అరగంట టైమివ్వు. ఏం చెయ్యాలో చెప్తాను,” అంటూ గూగుల్ మ్యాప్ ల నుండి ఏవేవో కొలతలు తీసుకుని, ఆ సమాచారం అంతా ఏదో సాఫ్ట్ వేర్ లోకి ఫీడ్ చేసి అరగంటలో పరిష్కారం కనుక్కుని తల్లికి  ఫోన్ చేసి చెప్పింది. ఆమె చెప్పిన క్రమంలోనే బంధుమిత్రుల ఇళ్ళన్నీ సందర్శించి సాయంత్రంలోపు పని పూర్తి చేసింది పార్వతమ్మ.

పార్వతమ్మ ఎదుర్కున్న సమస్య సైద్ధాంతిక కంప్యూటర్ సైన్స్ లో ముఖ్యమైన సమస్య. దీన్నే ట్రావెలింగ్ సేల్స్ మాన్ ప్రాబ్లమ్ (ప్రయాణించే సేల్స్ మాన్ సమస్య) అంటారు. ఇందులో ఓ సేల్స్ మన్ కొన్ని ఊళ్లు చుట్టి రావాలి. ఒకే ఊరికి రెండు సార్లు వెళ్ళకూడదు. అన్ని ఊళ్లూ తిరగాలి. మొత్తం చుట్టి రావడానికి పట్టే ఖర్చు కనీసమాత్రంగా ఉండాలి. ఈ సమస్య కనిపించినంత సులభం కాదు. ముఖ్యంగా ఊళ్ల సంఖ్య పెరుగుతుంటే సమస్య మరింత జటిలం అవుతుంది. ఎందుకంటే ఈ సమస్యని పరిష్కరించాలంటే ఎన్నో మార్గాలని పరిశీలించాలి. ప్రతీ మార్గానికి పట్టే ఖర్చు అంచనా వెయ్యాలి. ఊళ్ళ సంఖ్య పెరుగుతుంటే మార్గాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.
 
ఉదాహరణకి 5 ఊళ్లు ఉన్నాయనుకుందాం. ఐదింట్లో ఏదో ఒక దాని నుండి బయలుదేరొచ్చు. అక్కణ్నుంచి మిగతా 4 ఊళ్లలో ఏదో ఒక దాన్ని సందర్శించొచ్చు. ఆ 4 ఊళ్లలో ఒక్కొక్క దాని నుండి మూడేసి ఊళ్లు సందర్శించొచ్చు. అలా లెక్క  వేస్తూ పోతే మొత్తం 5 X 4 X 3 X 2 X 1 = 120  మార్గాలని, అంటే మార్గాంతరాలని పరిగణించాల్సి ఉంటుంది. ఇంకా సామాన్యంగా n ఊళ్లు ఉన్న సమస్యలో మొత్తం n! మార్గాంతరాలు ఉంటాయి. n విలువ పెరుగుతుంటే ఈ n! విలువ చాలా వేగంగా పెరిగిపోతుంది. ఇక పార్వతమ్మ గారి సమస్యలో యాభై ఇళ్ళు ఉన్నాయి కనుక 50! విలువ రమారమి 3X 1064 అవుతుంది. ఒక్కొక్క మార్గాంతరాన్ని పరిశీలించడానికి సెకనులో వెయ్యోవంతు కాలం పట్టినా మొత్తం అన్ని మార్గాంతరాలని పరిశీలించడానికి, మన ఆయుర్దాయం మాట అటుంచితే, ఈ విశ్వం ఆయుర్దాయమే సరిపోకపోవచ్చు.

ఈ ట్రావెలింగ్ సేల్స్ మన్ సమస్యని మొట్టమొదట నిర్వచించినవాడు ఐర్లాండ్ కి చెందిన హామిల్టన్ అనే గొప్ప గణితవేత్త. ఇరవయ్యవ శాతాబ్దపు మొదటి దశల్లో కార్ల్ మెంగర్ అనే గణితవేత్త దీన్ని పరిశీలించాడు. ఉన్న ఊరి నుండి కేవలం అతి దగ్గరి ఊరికి ప్రయాణిస్తూ పోయినంత మాత్రాన కనిష్ఠ మార్గం దొరుకుతుందని భరోసా లేదని ఇతడు నిరూపించాడు. 1950, 1960 లలో డాంట్ జిగ్, ఫుల్కర్సన్, జాన్సన్ వంటి వారు దీన్ని పరిశీలించి, ‘లీనియర్ ప్రోగ్రామింగ్’ అనే రంగంలో దీనినొక ప్రత్యేక సమస్యగా గుర్తించి, 49 ఊళ్ళున్న ఓ ప్రత్యేక సమస్యని కచ్చితంగా పరిష్కరించారు. తదనంతరం 1972 లో రిచర్డ్ కార్ప్ అనే గణితవేత్త ఈ సమస్యని ‘ఎన్.పి-కంప్లీట్’ అనే కోవకి చెందిన అతి కఠినమైన సమస్యల్లో ఒకటిగా గుర్తించాడు. దాంతో ఈ సమస్య ఎందుకంత కఠినమైనదో అర్థమయ్యింది.
ఈ ప్రయాణించే సేల్స్ మన్ సమస్య అతి కఠినమైనదే అయినా, కొన్ని ప్రత్యేక సందర్భాలలో దీన్ని కచ్చితంగా పరిష్కరించడానికి వీలయ్యింది. పైగా సూపర్  కంప్యూటర్ల వినియోగం పెరిగాక పెద్ద సంఖ్యలో ఊళ్లున్న సమస్యల్ని కూడా ఛేదించడానికి వీలయ్యింది.  1970, 1980 లలో గ్రోట్షెల్, పాడ్బర్గ్ తదితరులు 2,392 ఊళ్ళున్న సమస్యని పరిష్కరించారు. 2005 లో కుక్ అనే గణితవేత్త 33,810 ఊళ్లున్న సమస్యని పరిష్కరించాడు. ఆ పరిష్కారాన్ని గణించడానికి 15.7 సంవత్సరాల సీ.పీ.యు. సమయం అవసరమయ్యింది! 

ప్రయాణించే సేల్స్ మన్ సమస్య కేవలం ఒక ప్రత్యేక సమస్య కాదు. ఒక ప్రత్యేక కోవకి చెందిన సమస్యలకి అదొక చిహ్నం మాత్రమే. కనుక ఈ ప్రత్యేక సమస్యని పరిష్కరిస్తే, ఆ కోవకి చెందిన సమస్యలన్నీ పరిష్కరించినట్టే. కాల్ టాక్సీల  కార్యక్రమాలకి ఈ ప్రయాణించే సేల్స్ మన్ సమస్యతో సంబంధం ఉంది. వి.ఎల్. ఎస్. ఐ. చిప్ ల డిజైన్ లో కూడా ఈ పరిష్కారం ఎన్నో సందర్భాల్లో ఉపయోగపడుతుంది. కమ్యూనికేషన్ నెట్వర్క్ లలోను, కంప్యూటర్ నెట్వర్క్ లలో కూడా దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఒక్క గణిత సమస్య యొక్క పరిష్కారానికి దైనిక జీవితంలో ఎన్నో ఉపయోగాలు ఉండొచ్చునని చెప్పడానికి ఈ ప్రయాణించే సేల్స్ మన్ సమస్య ఓ చక్కని తార్కాణం.


http://www.andhrabhoomi.net/sisindri/lokam-chuttina-028

నీటిపై తేలే నగరాలు

Posted by V Srinivasa Chakravarthy Friday, August 12, 2011 1 comments




http://www.andhrabhoomi.net/intelligent/netipai-429

తాఫం కారణంగా పెరిగిన సముద్రపు మట్టంవల్ల తీరం తరిగిపోయినప్పుడు, వరదలవల్ల నేల జలమయం అయినప్పుడు, అగ్నిపర్వతాల వల్లనో, భూకంపాల వల్లనో నేల చిన్నాభిన్నమైనప్పుడు భూభాగం తగ్గిపోతుంది. విస్తీర్ణత తక్కువగా ఉన్న దేశాల విషయంలో ప్రకృతి విలయతాండవంవల్ల భూభాగం తగ్గిపోవడం నిజంగా గడ్డు సమస్యే అవుతుంది. కనుక నేల లేనిచోట, అంటే నీటి మీదనో, నీటిలోనో, ఆకాశంలోనో ఇళ్ళు, ఊళ్ళు కట్టుకుని నేలలేని వెలితి తీర్చుకోవాలన్న ఆలోచన ఎంతకాలంగానో ఉంది.

విస్తీర్ణత తక్కువై, జనాభా ఎక్కువైన జపాన్‌లో అలా నీటిపైతేలే నగరాల నిర్మాణం గురించి ఎంతకాలంగానో సన్నాహం జరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచంలోకెల్ల అతి పొడవైన బుర్జ్ ఖలీపా భవనం కన్నా ఎతె్తైన కిలోమీటర్ పొడవున్న భవనాన్ని నిర్మించాలని జపాన్‌కి చెందిన కొందరు శాస్తవ్రేత్తలు, ఇంజినీర్లు, వ్యాపారవేత్తలు కలిసిన బృందం ప్రయత్నిస్తోంది. ఓ పొడవాటి తామర తూడు కొసలో వికసించే అరవిందంలా, ఓ పొడవాటి స్తంభం మీద ఓ విశాలమైన నగరం నిర్మించబడుతుంది. దానికి ఆకాశపట్టణం (సిటీ ఇన్ ద స్కై) అని పేరు పెట్టారు. ఆ స్తంభం ఓ విశాలమైన (వ్యాసం మూడు కిలోమీటర్లు) వేదిక మీద ‘తామరాకు’లా నీటిపై తేలే ఓ విశావలమైన పడవమీద నిలబడుతుందిట. ఆ ఆకాశనగరంలో 30,000వేల మంది నివసించగలరని అంచనా. ఎత్తుమీద నివసించడానికి ఇష్టపడని వారికి అడుగున ‘తామరాకు’ వేదిక మీద నివాసాలు ఉంటాయి. ఇక్కడ 10,000 మంది దాకా జీవించగలరట. ఈ వింత నగరపు నిర్మాణంలో అతి తేలికైన మిశ్రమలోహాలు వాడడం జరుగుతుందని, దీన్ని నిర్మించటానికి పూనుకున్న జపనీస్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ షిమిజు అంటోంది. పైన వర్ణించబడ్డ నగరం నీటిపై తేలే నగరమే కాన అది కదలకుండా నిశ్చలంగా ఉంటుంది. అలా కాకుండా నీటిపై కదలే ఓడలాండి నగరాన్ని నిర్మించడానికి కూడా సన్నాహం జరుగుతోంది. ఆ ఓడ పేరు ‘స్వేచ్ఛ’. ఇరవైఐదు అంతస్థుల ఎత్తున్న భవనాలు వరుసగా మైలు పొడవున ఉంటే ఎలా ఉంటుందో ఆ ఓడ అలా ఉంటుంది. 1,317 మీటర్ల పొడవు, 221 మీటర్ల వెడల్పు, 103 మీటర్ల ఎత్తు ఉన్న ఈ ఓడ ముందు ఇక మామూలు నౌకలు మరుగుజ్జుల్లా ఉంటాయి. గాలి చొరబడని పెద్ద పెద్ద స్టీలు పెట్టెలతో ఈ ఓడకి పునాదిని నిర్మిస్తారు. ఒక్కొక్క పెట్టె 80 అడుగుల (24 మీటర్ల) ఎత్తు, 50 నుండి 100 అడుగుల (5 నుండి 30 మీటర్ల) వెడల్పు, 50 నుండి 120 అడుగుల (15 నుం 37 మీటర్ల) పొడవు ఉంటుంది. ఇలాంటి ఎన్నో పెట్టెలని కలిపి ఇంకా పెద్ద పెట్టెలని తయారు చేస్తారు. ఈ పెద్ద పెట్టెలతోనే మైలు పొడవున్న ఓడ యొక్క పునాది నిర్మిస్తారు. అసలు పని అంటూ మొదలైతే ఈ ఓడ నిర్మాణం మూడేళ్ళల్లో పూర్తవుతుందని ఈ భవనానికి మూలపురుషుడైన నార్మన్ నిక్సన్ అంటాడు.అంత పెద్ద నిర్మణాన్ని నీటిమీద ముందుకు నెట్టాలంటే చాలా శక్తి కావాలి. ఓడని చోదించడానికి నూరు పెద్ద డీసిల్ ఇంజెన్లు కావాలని ఒక్కొక్క దానికి మూడువేల హార్స్ పవర్ పైగా బలం ఉండాలని ఈ ప్రాజెక్టు ఇంజనీర్లు అంటున్నారు. ఈ మెగా ఇంజిన్ల ఖరీదు ఒక్కొక్క దానికి మిలియన్ డాలర్లు అవుతుందట. ఈ లెక్కన మొత్తం ఓడ నిర్మాణానికి అయ్యే ఖర్చు ఆకాశాన్నంటుతుందని వేరే చెప్పనక్కర లేదు. ఆ సొమ్మంతా ఓడలో రియల్ ఎస్టేట్ కొనుక్కునే అదృష్టవంతుల నుండి రాబట్టొచ్చని ప్రాజెక్ట్ నిర్మాతల ధీమా. ఈ సముద్ర నగరంలో ఒక్కొక్క ప్లాట్ ఖరీదు పదకొండు మిలియన్ల డాలర్లు మరి!
ఓ ఆధునిక నగరంలో ఉండే సౌకర్యాలన్నీ ఈ తేలే నగరంలో ఉంటాయట. స్కూళ్ళు, షాపింగ్ మాళ్ళు ఉంటాయి. నగరం పైభాగంలో చిన్న విమానాలు దిగేందుకు వీలుగా ఓ కిలోమీటరు పైగా పొడవున్న రన్‌వే ఉంటుంది. చిన్న పడవలు నిలుపుకోడానికి రేవు లాంటి సౌకర్యం ఉంటుంది. నానా రకాల ఆటలకి 200 ఎకరాల వైశాల్యం గల ఆటస్థలాలు ఉంటాయి. ఈ నగరంలో జీవించడం మొదలెట్టాక మహారాజ భోగమే. ఆ ఊళ్ళో జీవించేవాళ్ళు ప్రత్యేకించి పన్ను కట్టనక్కర్లేదు. అయితే ఈ ఓడ నెమ్మదిగా ప్రయాణిస్తూ రెండేళ్ళకి ఓసారి లోకం అంతా చుట్టొస్తుందిట. మార్గమధ్యంలో వివిధ దేశాల రేవులలో కొంత కాలం ఆగుతుంది. ఏ దేశంలో ఉంటే ఆ దేశపు చట్టాన్ని ఓడలో నివసించే పౌరులంతా పాటించవలసి వస్తుంది. ఆ చట్టం ప్రకారం ఆ దేశానికి ఏవైనా పన్ను కట్టవలసి వస్తే మరి కట్టక తప్పదు.ఈ ‘స్వేచ్ఛా నౌక’లో మరో విశేషం అక్కడి వ్యర్థాలతో వారు వ్యవహరించే తీరు, పర్యావరణం మీద ఏ విధమైన దుష్ప్రభావం చూపని విధంగా ఓడ నుండి ఏరకమైన వ్యర్థాలూ వెలువడకుండా జాగ్రత్తపడడం జరుగుతుంది. వ్యర్థాలన్నీ ఓడలోనే దగ్ధం చెయ్యబడతాయి. ఈమెగా నౌక ఎప్పుడు నిజం అవుతుందో గాని వర్తమాన కాలంలో మనిషి తలపెడుతున్న గొప్ప ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో ఒకటిగా ఈ ప్రాజెక్టు పేరు పొందింది.

మీ బదులు మీ ఉద్యోగం చేసే రోబో

Posted by V Srinivasa Chakravarthy Wednesday, August 3, 2011 0 comments


http://www.andhrabhoomi.net/intelligent/me-badulu-652

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts